- ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల పేరుతో మోసాలు
- చివరకు కటకటాలపాలు
నాంపల్లి/హైదరాబాద్: అతను చదివింది 9వ తరగతే! కానీ.. ఐఏఎస్ అధికారినన్న రేంజిలో ‘అఫీషియల్’ బిల్డప్ ఇస్తాడు!! ప్రిన్సిపల్ సెక్రటరీనని.. వర్సిటీ ప్రొఫెసర్నని.. ఆస్పత్రి సూపరింటెండెంట్నని.. ఎమ్మెల్సీనని.. విద్యాసంస్థల ప్రతినిధినని కట్టుకథలు చెప్పి నమ్మిస్తాడు. ఫోన్లో అధికార స్వరంతో ఆజ్ఞలు జారీ చేసి ఉన్నతాధికారులను, హై ప్రొఫైల్ వ్యక్తులను సైతంబురిడి కొట్టిస్తాడు. ఏపీ, తెలంగాణల్లో అతగాడి మాయలో పడిన చాలా మంది అతగాడు చెప్పిన అకౌంట్లో డబ్బులు జమ చేసి మోసపోయారు. కానీ, చివరకు హైదరాబాద్ వెస్ట్జోన్ పార్టీ, జూబ్లీహిల్స్ పోలీసులకు యాదృచ్ఛికంగా దొరికిపోయాడు. పోలీసులు అతడి నుంచి 20 వేల నగదు, నాలు సెల్ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్ రావు ఆదివారం విలేకరులకు అతడి గురించి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మచ్చిరాజు బాల వెంకట సుబ్రమణ్వేశ్వర శర్మ అలియాస్ శ్రీరామచంద్ర వీరేశ్వర్శర్మ 2003లో హైదరాబాద్కు వచ్చాడు. పలు ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడు. 2004 నుంచి అక్రమంగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు తెరతీశాడు.
ఇలా మోసం చేస్తాడు..
తొలుత ఉన్నత స్థాయి అధికారులను ఎంపిక చేసుకుని.. వారు పనిచేస్తున్న సంస్థ/విభాగంలోని కిందిస్థాయి అధికారుల పేర్లు, హోదాలను తెలుసుకుంటాడు. వారికి వల విసురుతాడు. ఉదాహరణకు.. ఇటీవలే మార్కెటింగ్ శాఖ కమిషనర్ దానకిషోర్ సబార్డినేట్ టీఎ్సఆర్కేశాస్త్రికి ఫోన్ చేశాడు. తాను దానకిషోర్ను మాట్లాడుతున్నానని.. తన పిల్లలు మెడికల్ కౌన్సెలింగ్కు వెళ్తుండగా రైలులో లగేజీ పోయిందని నమ్మబలికాడు. వెంటనే తన అకౌంట్లో 50 వేలు జమ చేయాలని, మరుసటి రోజే తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. ఫోన్లో అతడి గొంతులో అధికారం విని మోసపోయిన శాస్ర్తి డబ్బు సమకూర్చారు. మోసగాడి దందా అక్కడితో ఆగిపోలేదు. అదే రోజు దానకిషోర్ పేరుమీదే సంగారెడ్డి మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈశ్వరయ్యకు ఫోన్ చేసి.. అదే పాత కథ చెప్పి రూ.40 వేలు తన ఖాతాలో వేయించుకున్నాడు. మర్నాడు మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ సూపర్వైజర్కు ఫోన్. అదే కథ పునరావృతం. ఈసారి రూ.30 వేలకు టోపీ. ఇదే కోవలో.. వైజాగ్ కింగ్ జార్జి ఆసుపత్రి సూపరింటెండెంట్నని చెప్పుకొంటూ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ భీమేశ్వర్ను (రూ.40 వేలు), ఐఏఎస్ అధికారి జవహర్రెడ్డి పేరు చె ప్పి తూర్పు గోదావరి ఆర్డబ్ల్యూఎస్ ఈఈని (రూ.40 వేలు), ఎమ్మెల్సీ శేషారెడ్డి పేరు చెప్పి ఓ ఇంజనీరింగ్ కాలేజీ యజమానిని (రూ.50 వేలు), సింగరాయ కొండ డీఈఈని (రూ.75 వేలు), సింగరాయ కొండ ఇంజనీరింగ్ కళాశాల యజమానిని (రూ.25 వేలు), కుప్పం పట్టణానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తిని (రూ.50 వేలు), ప్రిన్సిపల్ సెక్రటరీని మాట్లాడుతున్నానంటూ పాడేరు ప్రాజెక్టు ఆఫీసర్ను (రూ.30 వేలు).. ఇలా చాలా మందిని మోసగించి డబ్బులు దండుకున్నాడు. ఇతడి వలలో పడని ఒకే వ్యక్తి.. పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు. ఆయనకూ రూ.50 వేల మేర టోపీ పెట్టాలని శర్మ ప్రయత్నించినప్పటికీ.. ఆయన అనుమానంతో పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదుచేశారు.
ఇలా దొరికాడు..
వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు.. ఇన్ని మోసాలు చేసిన బాలసుబ్రమణ్యేశ్వర శర్మ జూబ్లీహిల్స్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడి వైఖరిపై అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించగా నేరాల గుట్టు రట్టయింది. మొత్తమ్మీద తెలుగు రాష్ర్టాల్లోని తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, నల్గొండ, రాజమండ్రి, హుజురాబాద్, బీబీనగర్, బోయిన్పల్లి, నారాయణగూడ, విజయవాడ సిటీ సూర్యరావుపేట్, కడప తదితర పీఎ్సల పరిధిలో 20 మోసాలలో ఇతడు నిందితుడని తేలింది. ఇతడిపై మరో 10 కేసులు పెండింగ్లో ఉన్నాయని పోలీసులు వివరించారు.
|
No comments:
Post a Comment